హైదరాబాద్ (చట్టం) : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత కోరారు. తెలంగాణ ముద్దుబిడ్డకు దేశ అత్యున్నత పురస్కారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో సమాలోచన సభ నిర్వహించారు. తెలంగాణ తేజం మన పీవీ (సాహితీ సౌరభం – అసమాన దార్శనికత) పేరుతో, మాజీ ఎంపీ కవిత అధ్యక్షతన సమాలోచన సభ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత మాట్లాడుతూ.. దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా పీవీ ప్రధాని పదవి చేపట్టారన్నారు. పీవీ సేవలను యువతరానికి తెలియజేసేలా రాష్ట్ర వ్యాప్తంగా శతజయంతి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా తెలంగాణ జాగృతి నాయకులకు కవిత పిలుపునిచ్చారు. పీవీ మేధస్సును, సాహిత్యాన్ని యువతరానికి చేరేలా తెలంగాణ జాగృతి, ప్రతినెలా రెండు కార్యక్రమాలు నిర్వహించనుందని మాజీ ఎంపీ ప్రకటించారు. 'పీవీ బుక్ క్లబ్' పేరుతో, ప్రాచీన పుస్తకం, నవీన పుస్తకం పేరుతో ప్రతి నెలా రెండు కార్యక్రమాలు నిర్వహించి, పీవీకి అక్షర నివాళి అందిస్తున్నామన్నారు. పీవీ తన మేధస్సును దేశం కోసం ఉపయోగించారని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు సైతం పొగిడేంత, హుందాతనంతో పీవీ వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, రచయిత కల్లూరి భాస్కర్, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మహేష్ బిగాల హాజరయ్యారు.
0 Comments