
భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రభుత్వాధినేతగా..పాలకుడిగా.. నేటితో 20 ఏళ్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఈ మైలురాయిని అధిగమించారు నరేంద్ర మోదీ. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అక్టోబరు 7, 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అలా వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడుతూ కమల దళాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 2014, 2019లో ప్రధానిగా వరుసగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అలా 2001 నుంచి ఇప్పటి వరకు ఇటు వ్యక్తిగతంగా.. అటు ప్రభుత్వ పరంగా.. ఓటమనేదే ఎరుగరు నరేంద్ర మోదీ.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అవి విజయవంతం కావడంతో గుజరాత్ రూపు రేఖలే మారిపోయాయి. మొట్ట మొదటగా ఆయన విద్యుత్ సంస్కరణలు చేపట్టారు. విద్యుత్ సంస్కరణలంటే ఏ ప్రభుత్వమైనా రాజకీయలను దృష్టిలో ఉంచుకొని వెనకడుగు వేస్తుంది. కానీ మోదీ అలాకాదు.. రైతులు..ప్రజల్లో విశ్వాసం చూరగొనేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుజరాత్లోని ప్రతి మారుమూల గ్రామానికి.. ప్రతి ఇంటికీ.. విద్యుత్ అందించి వెలుగులు పంచారు.
పెట్టుబడుల వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన నరేంద్ర మోదీ.. గుజరాత్లోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించారు. జాతీయ స్థాయిలోనే పెట్టుబడుల సదస్సులు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిది 2003లో రాష్ట్ర స్థాయిలో పెట్టుబడుల సదస్సును నిర్వహించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత భారీగా పెట్టుబడులు రావడంతో గుజరాత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. పరిశ్రమలు, వ్యవసాయం, ఇన్ఫ్రా రంగాలు పురోగతిలో పయనించాయి. బాలిక విద్యను ప్రోత్సహించేందుకు కన్యా కెలవానీ ప్రోగ్రామం చేపట్టారు మోదీ. ముఖ్యమంత్రి హోదాలో గ్రామాల్లో బసచేస్తూ పాఠశాల్లో బాలికల ఎన్రోల్మెంట్పై దృష్టిసారించి విజయం సాధించారు. అలా గుజరాత్ మోడల్ గురించి విశ్వవ్యాప్తంగా తెలిసింది.
0 Comments