సీఎం కేసీఆర్ గుండెల నిండా సెక్యులరిజమే: మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ గుండెల నిండా సెక్యులరిజమే: మంత్రి కేటీఆర్

దేశంలో ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో క్రైస్తవ మిషనరీలు కీలకపాత్ర పోషించాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పేద దేశాల్లోనూ క్రైస్తవ మిష‌న‌రీలు మెరుగైన సేవలు అందిస్తున్నాయని అన్నారు. బంజారాహిల్స్‌లో బిష‌ప్‌లు, క్రైస్తవ ప్రముఖుల‌తో ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వ‌ర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధే తమ లక్ష్యమని, క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు.

మాట్లాడుతున్న కేటీఆర్
ఎక్కడ విప‌త్తులు సంభవించినా సేవ‌లు అందించ‌డానికి క్రైస్తవ స‌మాజం ముందు ఉంటుంద‌ని కొనియాడారు. సీఎం కేసీఆర్ హిందూ ధ‌ర్మాన్ని బ‌లంగా న‌మ్ముతారని, అదే స‌మ‌యంలో ఇత‌రుల న‌మ్మకాల‌ను కూడా గౌర‌విస్తారని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్‌ గుండెనిండా సెక్యులరిజమే ఉందని అన్నారు. తాను పుట్టింది కరీంనగర్‌లోని మిషనరీ ఆస్పత్రిలోనేనని గుర్తు చేసుకున్నారు. చదువుకున్నది మిషనరీ పాఠశాలలోనేనని అన్నారు.

అన్ని వ‌ర్గాల సంక్షేమ‌మే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం 940 గురుకులాలు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ఈ గురుకులాల్లో 5 ల‌క్షల మంది విద్యార్థులు చ‌దువుతున్నారని అన్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.20 ల‌క్షలు ఖ‌ర్చు చేస్తోందని వివరించారు. క్రైస్తవుల సలహా సంఘం ఏర్పాటు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కేటీఆర్ కోరారు.

Post a Comment

0 Comments