ఏపీలో వరదలపై సీఎం జగన్ సమీక్ష

ఏపీలో వరదలపై సీఎం జగన్ సమీక్ష


రాష్ట్రంలో వరదలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణానదిలోకి భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని కృష్ణా, గుంటూరు కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ముంపు బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉండాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేశారు.  కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరద నీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోలపై సీఎంఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నుంచి ప్రజలను ఖాళీచేయించాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న వరదను అంచనా వేసుకుని ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు గోదావరిలో కూడా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వారికి ఆహారం, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈమేరకు ఇరు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.


Post a Comment

0 Comments