కెరళా : కరోనా మహమ్మారి నుండి పిల్లలు, వృద్దులకే ప్రమాదం ఉందన్న వాదనలో పసలేదని నిరూపించారు తిరువనంతపురంకు చెందిన వైద్యులు. కరోనా కోరల్లో చిక్కుకున్న 93ఏళ్ల వృద్దున్ని, అదే విధంగా 88ఏళ్ల వయస్సుగల అయన భార్యను కాపాడి అందరి అపోహలు పటాపంచలు చేశారు. ఈ విషయం స్వయంగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ వెల్లడించారు. ఆ వృద్దులు డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఇతర వయోభార సమస్యలనున్నప్పటికి వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ వైరస్ బారి నుండి బయటపడ్డారని తెలిపారు. దేశవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తూ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో వృద్దదంపతులు ఇద్దరు కరోనా బారి నుండి బయట పడడం ఊరట నిస్తుంది.
కేరళలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న పథసంతిట్ట జిల్లా రాన్ని ప్రాంతానికి చెందిన ఈ వృద్ద దంపతుల కుమారుడు, భార్యా పిల్లలు ఇటలీ నుంచి తిరిగొచ్చారు. అప్పటికే వారికి వైరస్ సోకడంతో అదికాస్తా ఇతర కుటుంబ సభ్యులకు వ్యాపించింది. ఇలా ఈ వృద్ద దంపతులతో సహా ఆ కుటుంబంలో మొత్తం ఏడుగురు వైరస్ బారిన పడ్డారు. దీంతో వారందరిని వెంటనే కొట్టాయం మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వీరికి 40 మందితో కూడిన వైద్య బృందం చికిత్స అందించింది. హృదయ సంబంధిత సమస్యలు ఉండడంతో తొలుత వృద్ద దంపతుల ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు. కానీ వైద్యులు ఇచ్చిన సూచనలు, సలహాలు క్రమం తప్పకుండా పాటించడంతో ప్రాణాపాయ స్థితి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం వైరస్ నెగిటివ్గా వచ్చింది. మిగతా కుటుంబ సభ్యులు సైతం కోలుకుంటున్నారు. దురద్రుష్టవశాత్తు వీరికి చికిత్స అందించిన వారిలో ఓ నర్సుకు వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందజేస్తున్నారు.
ఆమె ఆరోగ్య పరిస్థితిపై మంత్రి శైలజ ఆరా తీశారు. నర్సు కోలుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైరస్ పోకినప్పటికి మానసిక స్థైర్యం కోల్పోకుండా చికిత్సకు సహకరిస్తూ వైద్యుల సలహాలు పాటిస్తే వైరస్ తగ్గిపోతుందన్న నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయి. కేరళలో సోమవరి కొత్తగా 32మందికి వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడ వైరస్ బారినపడిన వారి సం•్య 222కు చేరింది. వీరిలో ఒకరు మరణించగా 19 మంది కోలుకున్నారు.

0 Comments