సొసైటీలో నిల్వ ఉండాల్సిన యూరియా మాయం కావడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటన పాల్వంచ మండలం ఫరీద్ సొసైటీలో చోటుచేసుకుంది.
Urea Bags Missing | ఫరీద్ పేట గ్రామంలో..
ఫరీద్ పేట గ్రామంలోని సొసైటీ గోదాం నుంచి 177 యూరియా (Urea) బస్తాలు మాయం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. రైతుల కోసం సొసైటీ అధికారులు ఇటీవల యాప్లో 2,334 యూరియా బ్యాగులను స్టాక్గా చూపించగా, అందులో 2,157 బ్యాగులను రైతులకు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే మిగిలిన బ్యాగుల కోసం రైతులు యాప్ ఓపెన్ చేసి చూడగా నో స్టాక్ అని చూపిస్తుండటంతో అనుమానం వచ్చింది. లెక్క ప్రకారం ఉండాల్సిన 177 బ్యాగులు తక్కువగా రావడం, గోదాంలో స్టాక్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా దొరకని రైతులు సొసైటీ అధికారులను నిలదీయగా వారు పొంతనలేని సమాధానాలు ఇచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు.
గతంలో కూడా మాచారెడ్డి సొసైటీ పరిధిలో వందలాది యూరియా బ్యాగులు ఇదే తరహాలో మాయమయ్యాయని, ఇప్పుడు ఫరీద్ పేటలో కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఆన్లైన్లో చూపించిన యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని విచారణ జరిపి అర్హులైన రైతులకు యూరియా సకాలంలో అందేలా చూడాలని, బ్యాగులు మాయం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

0 Comments