కాన్వాయ్‌లో వెళ్తూ కూడా యువకుడిని గమనించిన ముఖ్యమంత్రి జగన్

కాన్వాయ్‌లో వెళ్తూ కూడా యువకుడిని గమనించిన ముఖ్యమంత్రి జగన్

అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదని అంటారు. కానీ.. జగన్ మాత్రం అడగకున్నా ఆదుకున్నారని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం అంటోంది. అవును.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ ముగించుకొని.. సీఎం తన కాన్వాయ్‌లో వెళ్తుండగా.. రోడ్డుపైన నిస్సహాయ స్థితిలో వీల్‌చైర్‌లో కూర్చున్న ఒక యువకుడిని గమనించారు. అతడి వైపు చేయి చూపుతూ.. తాను ఉన్నాననే భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరుకు చెందిన ఏసుబాబు, శివగంగల దంపతుల కుమారుడు లక్ష్మణ్‌కు రెండేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. 71 రోజులు ఆస్పత్రిలోనే వైద్యం పొందినప్పటికీ.. పూర్తిగా నయం కాలేదు. కాలు చచ్చుపడిపోయింది. కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు.. శక్తికి మించి వైద్యం చేయించారు. అటు.. ప్రతి నెలా మందులకు రూ.10 వేలు వెచ్చించడం భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్‌ను కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని బాధితుడు లక్ష్మణ్‌.. తన తల్లిదండ్రులతో విజయవాడకు వచ్చాడు.

వీరిని చూసిన జగన్.. కారులో ఉండగానే.. అతడి సమస్య ఏంటో తెలుసుకోవాలని తన సెక్యూరిటీ అధికారులను సీఎం జ‌గ‌న్‌ ఆదేశించారు. ఆ వెంటనే.. అతడి వివరాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అంతటితో ఆగకుండా.. ఆ తర్వాత కూడా యువకుడి విషయం ఎంతవరకు వచ్చిందని జగన్‌ మరోసారి ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలుసుకున్న జగన్.. ఆ యువకుడికి అవసరమైన సాయం అందేలా.. వైద్యానికి అవసరమైన ఖర్చును అంచనా వేసి తనకు వివరాలు పంపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు.

కలెక్టర్‌ ఢిల్లీ రావు స్వయంగా తన వాహనాన్ని యువకుడి ఉన్న చోటుకు పంపారు. అతడిని తన కార్యాలయానికి తీసుకురావాలని సూచించారు. కుటుంబ సభ్యుల ద్వారా అతడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ వెంటనే డీఎంహెచ్‌ఓను పిలిపించి.. చికిత్స నిమిత్తం యువకుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. తక్షణ సహాయం కింద లక్ష రూపాయల చెక్కును కలెక్టర్‌ ఢిల్లీ రావు ఆ యువకుడికి అందజేశారు. దీంతో ఆ కుటుంబం భావోద్వేగానికి గురైంది. జగన్ చేసిన మేలు మర్చిపోలేమని.. లక్ష్మణ్ తండ్రి ఏసుబాబు చెప్పారు.

Post a Comment

0 Comments