ఆ గుడిలోకి వెళ్లాలంటే అందరూ భయపడతారు.. కారణం తెలిస్తే షాకవుతారు..

ఆ గుడిలోకి వెళ్లాలంటే అందరూ భయపడతారు.. కారణం తెలిస్తే షాకవుతారు..

 మనలో దేవుళ్లను నమ్మే వారంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండుగల సమయంలో దేవాలయాలకు వెళ్తుంటారు. కొందరు ప్రతిరోజూ గుడికి వెళ్తారు. ఇంకా కొందరు తమకు వీలైనప్పుడల్లా ఆలయాలకు వెళ్లి దేవుని దర్శనం చేసుకుని వస్తుంటారు. ఇలా దేవుని సన్నిధికి వెళ్లడం వల్ల భగవంతుని ఆశీస్సులు, అనుగ్రహం తప్పకుండా లభిస్తాయని, ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతే కాదు ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. చాలా దేవాలయాల్లో అనేక రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అందుకే మన దేశంలో ఉండే ప్రముఖ దేవాలయాలను సందర్శించడానికి విదేశీయులు సైతం ఎంతో ఆసక్తి చూపుతారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దెయ్యాలు, పిశాచాల బారి నుండి తమను తాము కాపాడుకోవడానికి గుడికి వెళ్తామని చెబుతుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో గుడికి వెళ్లే ఉంటారు.. కొందరు వెళ్తూనే ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మన దేశంలో ఉండే ఒక ఆలయం లోపలికి వెళ్లేందుకు మాత్రం ఎవ్వరూ ఇష్టపడరట. అసలు ఆ గుడిలోకి అడుగు పెట్టాలంటేనే అందరూ తెగ వణికిపోతారట. ఇంతకీ ఆ గుడిలో ఏ దేవుడు ఉన్నాడు.. అది ఎక్కడుంది.. అక్కడికి వెళ్లేందుకు అందరూ భయపడేందుకు గల కారణాలేంటో ఇప్పుడే చూసెయ్యండి.

​హిమాచల్ ప్రదేశ్ లో..

మన దేశంలో నిత్యం మంచుతో కప్పబడి ఉండే ప్రాంతమైన హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబాలోని భర్మోర్ అనే చిన్నపట్టణంలో ఈ ఆలయం ఉంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ ఆలయం మహిమలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. అయినా కూడా ఈ గుడిలోకి వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మ రాజ ఆలయం ఎప్పుడు, ఎవరు, ఎలా నిర్మించారనే వివరాలు ఎవ్వరికీ స్పష్టంగా తెలీదు. అయితే చంబా రాజు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దలో పునరుద్ధరించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం కూడా కేవలం మెట్ల వరకు మాత్రమే ఉంది. మొత్తం ఆలయం గురించి పూర్తి సమాచారం లేదు.

​ఏ దేవుడు ఉన్నాడంటే..

ఈ ఆలయం మృత్యు దేవుడైన యమ ధర్మరాజుకు చెందినది. ప్రపంచంలో యమ ధర్మరాజుకి సంబంధించిన ఏకైక ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఈ ఆలయం యమ ధర్మరాజు కోసమే నిర్మించబడిందని, అందుకే అతను తప్ప, ఇతరులెవరూ ఈ ఆలయం లోపలికి ప్రవేశించలేరని అక్కడి స్థానిక ప్రజలు చెబుతారు. అయితే జానపద విశ్వాసాల ప్రకారం, ఎవరైతే వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా యమ దేవుడిని పూజిస్తారో వారికి అకాల మరణం అనేదే అస్సలు ఉండదు. అంతేకాదు వారు భయం లేకుండా ఉంటారు.

​చిత్రగుప్తుడికీ ఓ గది..
ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉందట. అదేంటంటే.. పురాణాల ప్రకారం ఎల్లప్పుడూ యమ ధర్మరాజు కార్యదర్శి చిత్రగుప్తుడికి సైతం ఈ దేవాలయంలో ఒక ప్రత్యేక గదిని నిర్మించారట. మనుషులందరూ చేసే తప్పు, ఒప్పులను ఒక పుస్తకంలో ఉంచారని గ్రామ ప్రజలు చెబుతారు. వాస్తవానికి మనుషులు చనిపోయినప్పుడు, భూమిపై వారు చేసిన పనిని బట్టి వారికి స్వర్గంలోకి పంపించాలా లేదా నరకానికి పంపాలా అనేది నిర్ణయించేది చిత్రగుప్తుడు మాత్రమే. అంటే మనకు స్వర్గమా లేదా నరకమా అనేది కేవలం చిత్రగుప్తుని చేతిలో మాత్రమే ఉంటుంది.

​బయటినుంచే నమస్కారం..
ఈ దేవాలయం లోపల బంగారం, వెండి, రాగి, ఇనుముతో చేసిన నాలుగు రకాలైన ద్వారాలు ఉన్నాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఎవరైతే భూమి మీద ఎక్కువ పాపాలు చేసి ఉంటారో.. వారి ఆత్మలన్నీ ఇనుప ద్వారం లోపలికి వెళ్తాయని, అదే విధంగా పుణ్యం చేసిన వారి ఆత్మలు బంగారం ద్వారం ద్వారా లోపలికి వెళ్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ గుడి లోపలికి వెళ్లకుండా కేవలం బయటినుంచే యమ ధర్మరాజును నమస్కారం చేసుకుని వెళ్లిపోతారట. పితృ పక్షాల సమయంలో ఈ గుడి ప్రాంగణంలో అకాల మరణం చెందిన వారికి పిండప్రదానం చేస్తారు. ఈ ఆలయం సమీపంలో వైతర్ణి నది కూడా ప్రవహిస్తుంది. గరుడ పురాణంలో కూడా యమరాజు ఆస్థానానికి సమీపంలో ఉన్న వైతర్ణి నది గురించి ప్రస్తావన ఉంది.

Post a Comment

0 Comments