Encounter At Andhra Odisha Border: ఏవోబీలో తప్పని భారీ ఎన్ కౌంటర్.. చలపతి, అరుణకు గాయాలు, ఆర్కే సేఫ్

Encounter At Andhra Odisha Border: ఏవోబీలో తప్పని భారీ ఎన్ కౌంటర్.. చలపతి, అరుణకు గాయాలు, ఆర్కే సేఫ్

పాడేరు, జూలై 22: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) త్రుటిలో భారీ ఎన్‌కౌంటర్‌ తప్పింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే ఆ సమయంలో సంఘటనాస్థలిలోనే ఉన్నారని సమాచారం. పోలీసు కాల్పుల్లో మరో అగ్రనేత, ఏవోబీ కార్యదర్శి చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. ఘటనాస్థలంలోని పొదలు, ఆకులు, రాళ్లగుట్టలపై కనిపిస్తున్న రక్తపు మరకలను బట్టి పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు.
Encounter At Andhra Odisha Border:
అగ్రనేతలు చిక్కినట్టే చిక్కి తప్పించుకొన్నారన్న సమాచారం ఏవోబీ సరిహద్దుల్లో ఉద్రిక్తతను రేపింది. సరిహద్దులను అన్నివైపులనుంచి మూసివేసి రెండు రాష్ట్రాల పోలీసులు గాయపడిన టాప్‌ మావోయిస్టుల వేటను ముమ్మరం చేశారు. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు... ఆనవాయితీ ప్రకారం ఈనెల 28 నుంచి అమరవీరుల వార్షిక వారోత్సవాలను భారీఎత్తున నిర్వహించడానికి మావోయిస్టులు సిద్ధమయ్యారు. ఈ వారంరోజుల కార్యక్రమాల రూపకల్పన కోసం వారంతా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా బెజ్జంగి అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారని ఈనెల 14న పోలీసు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, స్థానిక కీలక మిలీషియా సభ్యులు పాల్గొంటున్నారని కూడా ఉప్పందింది. తమవైపు మొదలైన ఈ కదలికతో ఒడిశా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ మరునాడే కూంబింగ్‌ మొదలుపెట్టి రెండురోజులు గాలింపు జరిపారు. ఈ క్రమంలో ఈ నెల 16 తేదీన ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల కంట మావోయిస్టులు పడ్డారు. పోలీసులను చూడగానే మావోయిస్టులు, ఆ వెంటనే పోలీసులు కూడా కాల్పులను ప్రారంభించారు. కాల్పులు జరుపుతూనే మావోయిస్టు అగ్రనేతలు, మిలీషియా సభ్యులు ఘటనాస్థలం నుంచి తప్పించుకుపోయారు.

Post a Comment

0 Comments