ఏపీ కేబినెట్‌లో అనూహ్య మార్పులు? ఉత్తరాంధ్రకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు?

ఏపీ కేబినెట్‌లో అనూహ్య మార్పులు? ఉత్తరాంధ్రకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు?

ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం మధ్యాహ్నం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు కొత్త మంత్రులుగా అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జోగి రమేష్, పొన్నాడ సతీష్‌లకు అవకాశం ఇస్తారని భావించినా సామాజిక వర్గాల కూర్పుతో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజులను తీసుకోవాలని జగన్‌ భావించారట.

సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు.. గోల్డ్ మెడల్ సంపాదించారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇక చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో జెడ్పీ ఛైర్మన్‌‌గా పనిచేసిన అనుభవం ఉంది.

ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బోస్ సీనియర్ కావడంతో.. మళ్లీ సీనియర్ నేతకే అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రోడ్లు భవనాల మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది.

Post a Comment

0 Comments