
తెలంగాణలో అందరికీ ఉచితంగా కొవిడ్ వ్యా్క్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర జనాభా మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక రంగాల్లో పనిచేస్తున్న వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4 కోట్ల మంది దాకా ప్రజలు ఉన్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని తెలిపారు. మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా వాక్సినేషన్ ఇస్తామని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనీ కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్యశాఖ అధికారులకూ ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తుందని, రెడ్డీ ల్యాబ్స్తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
0 Comments