
అమరావతి: కోవిడ్-19పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ నివారణా చర్యల్లో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రులు సంఖ్య 5 నుంచి 10 కి పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నట్లు జగన్ తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో ఏం చేయాలన్న దానిపై రెండు మూడు రోజుల్లో నివేదిక తయారీ చేయాలని ఆదేశించారు.
5 రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన సేవల కోసం సత్వర చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్ సోకిందన్న అనుమానం వస్తే ఏం చేయాలి? ఎవరిని కలవాలన్న దానిపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాలని సూచించారు. కోవిడ్ ఎవరికైనా వస్తుందని, ఆందోళన వద్దని చెప్పారు. వైద్య సహాయం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలన్నారు. 85 శాతం మందికి ఇళ్లల్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటే తగ్గుతుందని తెలిపారు. జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు, వయసులో పెద్ద వాళ్లు వైద్య సహాయంలో ఆలస్యం వద్దని జగన్ హితవుపలికారు.
0 Comments