నేటి నుంచి రైతుల ఖాతాల్లో నిధులు.. రూ.50వేల కోట్ల మైలురాయికి ‘రైతుబంధు’

నేటి నుంచి రైతుల ఖాతాల్లో నిధులు.. రూ.50వేల కోట్ల మైలురాయికి ‘రైతుబంధు’

రాష్ట్రంలో నేటి(మంగళవారం) నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు పథకం నిధులు జమ కానున్నాయి. ఈ నెల 10 నాటికి ధరణి పోర్టల్‌లో నమోదైన భూముల పట్టాదారులు, అటవీ భూముల యాజమాన్య హక్కులు (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) పొందిన వారు రైతుబంధు పథకానికి అర్హులని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం తెలిపారు. యాసంగి సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులకు, 152.91 లక్షల ఎకరాలకు, రూ.7,645.66 కోట్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఆర్‌వోఎఫ్ఆర్‌ పట్టాదారులైన 94 వేల మంది రైతుల ఆధీనంలోని 3.05 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందిచనున్నట్లు తెలిపారు.


మంగళవారం ఎకరాలోపు భూమి ఉన్నవారికి, బుధవారం 2 ఎకరాలు, గురువారం మూడెకరాలు.. ఇలా రోజూ ఎకరం చొప్పున పెంచుతూ రైతు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 7 విడతల్లో రైతుల ఖాతాల్లో మొత్తం రూ.43,036.63 కోట్లు జమ చేశామని, ఈ సీజన్‌తో కలిపితే రూ.50 వేల కోట్ల మైలురాయిని చేరుకుంటామని నిరంజన్‌రెడ్డి వివరించారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాల్లో ఒకటిగా రోమ్‌లో 2018 నవంబరులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్‌ఏవో గుర్తించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

Post a Comment

0 Comments