
తెలంగాణలోని రజకులు, నాయీ బ్రాహ్మణులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని సెలూన్ షాపులు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డికి సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అందుకు సంబంధించిన జీఓను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఈ ఉచిత విద్యుత్తు సరఫరా ఏప్రిల్ 1 తారీఖు నుంచే అమల్లోకి రానుంది.
అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేకల పథకాలను అమలు పరుస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయి నుంచి జీహెచ్ఎంసీ దాకా ఉన్న కటింగు షాపులకు, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. తద్వారా, తర తరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని చెప్పారు సీఎం కేసీఆర్.
కాగా, సాంకేతికాభివృద్ది కారణంగా పలు రకాల యంత్రాలు రజకులు, నాయీ బ్రాహ్మణుల కుల వృత్తుల నిర్వహణలో దోహద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్తు నిర్ణయం ద్వారా వృత్తి దారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్ధిక వెసులు బాటు కూడా కలగనుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంపై తెలంగాణలోని రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ విజ్ఞప్తిని మన్నించి ఉచిత కరెంటుపై నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు
0 Comments