రైతులకు పండగే.. మరో శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

రైతులకు పండగే.. మరో శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్


తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. అవసరమైతే రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే మద్దతు ధరతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలంలో ఉన్న ఒంటిమామిడి మార్కెట్ యార్డ్‌ను బుధవారం సాయంత్రం కేసీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్‌కు ఆలుగడ్డలు తీసుకువచ్చిన నెంటూర్ గ్రామానికి చెందిన కిచ్చుగారి స్వామి, బంగ్లా వెంకటాపుర్ చెందిన రైతులతో సీఎం మాట్లాడారు. ఆలుగడ్డలు ఎంత ధరకు అమ్ముడుబోతున్నాయో, వాటికి ఎంత పెట్టుబడి పెట్టారు, గిట్టుబాటు ధర ఎంత వస్తుందో వారిని అడిగి తెలుసుకున్నారు. కూరగాయాలతో లాభాలు వస్తున్నాయా? అని వివరాలు సేకరించారు.

కూరగాయల పంటలసాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్ సౌకర్యం వంటి విషయాల గురించి రైతులను ఆరా తీశారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా రైతులకు పలు కీలక సూచనలు చేశారు సీఎం కేసీఆర్. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. శాస్త్రీయ విధానంలో పంటలను సాగుచేస్తే వ్యవసాయం, కూరగాయల సాగు లాభసాటిగా మారుతుందని చెప్పారు. రైతుల వద్ద నుంచి కేవలం నాలుగు శాతం మాత్రమే కమీషన్ తీసుకోవాలని కమీషన్ ఏజెంట్లకు సీఎం సూచించారు. ఎవరూ కూడా రైతులను ఇబ్బంది పెట్టకూడదని.. వేధిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఒంటి మామాడి మార్కెట్‌కు అనుబంధంగా కూరగాయల నిల్వ కోసం 50 ఎకరాల భూమిలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని రైతులకు సీఎం హామీ ఇచ్చారు. మార్కెట్ విస్తరణ కోసం 14 ఎకరాల భూమిని చిన్నతిమ్మాపూర్ గ్రామపంచాయతీ నుంచి తక్షణమే సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. చిన్న తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి 4 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Post a Comment

0 Comments