త్వరలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు .. సంకేతాలిచ్చిన సీఎం కేసీఆర్

త్వరలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు .. సంకేతాలిచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకేతాలిచ్చారు. ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపుదల అంశాలపై వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని రవాణా, విద్యుత్‌ శాఖ మంత్రులు, అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఆయన ఆర్టీసీ, విద్యుత్‌ శాఖలపై సమీక్షించారు. మంత్రులు కేటీ రామారావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, రవాణా, ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్‌శర్మ, రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
For Telugu Love Quotes Visit:

ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షలో ఆర్టీసీ పరిస్థితిని సంస్థ ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని, నష్టాల నుంచి బయటపడాలంటే ఛార్జీలు పెంచక తప్పదని పేర్కొన్నారు. ఛార్జీల పెంపుతో పాటు ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని, లేకపోతే భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ అసాధ్యమని తేల్చిచెప్పారు. కరోనా లాక్‌డౌన్‌తో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా సంస్థ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతోందని తెలిపారు.

దీనీపై సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ, ‘‘ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టాం. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభించాం. గాడిలో పడుతుందనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరం’ అని అన్నారు.

‘కరోనా సంక్షోభంతోపాటు డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీ పరిస్థితి దిగజారిందని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో డీజిల్‌ ధర లీటరుకు భారీగా పెరగడం వల్ల రూ. 550 కోట్ల మేర, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరల వల్ల మరో రూ.50 కోట్ల మేర కలిసి సాలీనా రూ.600 కోట్ల భారం పడుతోంది. లాక్‌డౌన్ల వల్ల రూ. 3000 కోట్ల మేరకు నష్టపోయింది. హైదరాబాద్‌ పరిధిలోనే నెలకు రూ. 90 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ కష్టకాలంలో ఛార్జీలు పెంచక తప్పదు. 2020 మార్చిలోనే ఛార్జీలను పెంచుతామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినా కరోనా కారణంగా పెంచలేదు. ఇప్పటికే ఉద్యోగుల సంక్షేమానికి, ఆర్టీసీని పటిష్ఠపరిచేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వంపై ఇంకా మీద భారం మోపమనడానికి మాకు మాటలు రావడంలేదు. ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతిస్తే తప్ప మనుగడ సాధ్యం కాదు’ అని మంత్రులు అజయ్‌కుమార్‌, జగదీశ్‌రెడ్డి, ఉన్నతాధికారులు సజ్జనార్‌, ప్రభాకర్‌రావు అన్నారు. సమీక్ష సందర్భంగా ఆర్టీసీ పార్సిల్‌ సేవలు విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్‌ అధికారులను అభినందించినట్లు తెలిసింది.

Post a Comment

0 Comments